సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే భాధ్యత అదికారులపై ఉంది:శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

0
340 Views

వికారాబాద్:సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే భాధ్యత అదికార్లపై ఉందని శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు-2024 ముసాయిదా బిల్లు, ఎల్ఆర్ఎస్ పై అవగాహణ కార్యక్రమంతో పాటు జిల్లాలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అదికారులను ఉద్దేశించి సభాపతి మాట్లాడుతూ… సామాన్య ప్రజానిక సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు స్నేహపూర్వకంగా , సమన్వయంతో, కలిసికట్టుగా పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు రెండు కళ్ళల్లాగా ఉండి ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలలో జిల్లా ఎంతగానో అభివృద్ధి దిశగా వెళ్తుందని ఆయన తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, విద్యారంగా అభివృద్ధితో పాటు 400 కోట్ల నిధులతో అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూపకల్పన గావించడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రం ఎంతో ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఉద్యోగులకు ప్రతినెల క్రమం తప్పకుండా జీతాలు చెల్లించడం జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని సభాపతి తెలిపారు. వర్షాల వల్ల పంట నష్టం జరిగినట్లయితే నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. ప్రతి నెల ముఖ్యమైన శాఖలపై సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సమీక్ష నిర్వహించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కార దిశగా అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు.

గతంలో ధరణి ద్వారా ఎంతో మంది రైతులు ఇబ్బందులకు గురయ్యారన్నారు. భూముల సమస్యలను సత్వర పరిష్కారానికి భూమాత చట్టాన్ని తీసుకువస్తున్నట్లు సభాపతి తెలిపారు. భూమాత చట్టమును పటిష్టంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, మేధావి వర్గం, న్యాయ వాదులు, స్వచ్ఛంద సంస్థల సలహాలను పరిగణనలోకి తీసుకుని భూమాత చట్టం ద్వారా భూముల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. సమస్యల పరిష్కార నిమిత్తం కోర్టుల చుట్టూ తిరుగకుండా కింది స్థాయిలోనే సమస్యలను పరిష్కార దిశగా భూమాత ద్వారా సాధ్యమవుతుందని ఆయన అన్నారు. 2014 కంటే ముందు వున్న సాదా బైనమ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

జిల్లాలో చేపడుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సభాపతి తెలిపారు. వర్షాకాలంలో చెరువులు, కుంటలు ఎన్ని నిండాయి, ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇవ్వగలుతామో క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలను సమర్పించాలని స్పీకర్ అధికారులను ఆదేశించారు.

పశు సంపదను సంరక్షించుకునే బాధ్యతలో భాగంగా పశువులకు వాక్సినేషన్ కు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి సూచించారు. గురుకుల పాఠశాలలు, అమ్మ ఆదర్శ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు మంచి నీటిని సమృద్ధిగా అందేలా, స్వచ్ఛమైన నీటిని అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాగ్నా నది ద్వార మంచి నీరును అందించే దిశగా మిషన్ భగీరథ, జిల్లా పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య, విద్యుత్తు, మైనింగ్, అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపడుతున్న పనులు, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖలకు సంబంధించిన పనులపై సమీక్షించారు.

అవగాహణ, సమీక్షా కార్యక్రమంలో పార్లమెంటరీ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ కే.నారాయణ రెడ్డి , శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి, పరిగి, తాండూర్, చేవెళ్ల శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి, బుయ్యాని మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య , అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, మున్సిపల్ చైర్మన్లు మంజుల రమేష్, స్వప్న పరిమల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు, తహసీల్దార్లు, ఎంపీడీవో లు పాల్గొన్నారు.