సర్దార్ సర్వాయి పాపన్న పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
192 Views

వికారాబాద్: బడుగు బలహీనవర్గాలు సర్దార్ సర్వాయి పాపన్న పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఉత్సవాలను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్ట మొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. సర్వాయి పాపన్న సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా, గీతా కార్మికుడిగా తన ప్రస్థానంలో భాగంగా అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సలిపిన మహాయోధుడని అన్నారు. ఎటువంటి అండదండలు లేకుండా బడుగు కులాలను ఏకం చేసి భూస్వాములు, మొగల్ లు శిస్తుల రూపంలో పన్నుల వసూల్ల పేరుతో ప్రజలను పీడిస్తున్న క్రమంలో వారికి అండగా నిలిచి పోరాటం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల విద్యార్థినీ, విద్యార్థులు దేశభక్తి పాటలను ఆలపించారు.

సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ వసతి గృహాల బాల, బాలికలకు నోటు పుస్తకాలు, పెన్నులను బహుకరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కె.ఉపేందర్, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భీమరాజు, వసతి గృహ సంక్షేమ అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది, వసతి గృహ సిబ్బంది, బాల, బాలికలు పాల్గొన్నారు.