తాండూర్ లో వ్యక్తి దారుణ హత్య

0
9 Views

తాండూర్ : నిర్మానుష్య ప్రదేశంలో కుళ్లిన డెడ్‌ బాడి లభ్యమయ్యింది. ఈ సంఘటన తాండూరు పట్టణంలో కలకలం రేపింది. మంగళవారం పట్టణంలోని డీసీఎంఎస్ గోదాం వెనుక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మృతి అక్క తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా హరిదాసుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు గౌడ్(40) హైదరాబాద్లో ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తుండేవాడు. తాండూరు పట్టణంలో అతని అక్క అనురాధ ఉంటుంది. శివరాత్రి పండగ కోసం నాగరాజు గౌడ్ తాండూరు పట్టణానికి వచ్చాడు. మరుసటి రోజు నుంచి నాగరాజు గౌడ్ కనిపించకుండా పోయాడు. అతను హైదరాబాద్ వెళ్లిపోయి ఉంటాడని అనుకున్నారు. తాజాగా మంగళవారం డీసీఎంఎస్ కార్యాలయం వెనుక ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో కుళ్లిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న అక్క అనురాధ సంఘటనా స్థలానికి చెరుకుని పరిశీలించారు. మృతదేహానికి ఉన్న చెవి పోగులు, చేతి కడియాలు చూసి నాగరాజు గౌడ్ గా ఆమె గుర్తించింది. అనురాధ భర్త శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.