ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం:జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్

0
56 Views

వికారాబాద్:ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, వచ్చే జనవరి 6 వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు.బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి, జిల్లాఅదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈనెల 20 నుండి నిర్వహించబోయే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్షించి పలు సూచనలు, సలహాలు అందచేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వివరిస్తూ…. ఈనెల 20 నుండి వచ్చే అక్టోబరు 18 వరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఇంటింటా సర్వేతో బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలించి కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పు, తప్పులు సవరణ వంటి పనులు నిర్వహించడం జరుగుతుందని, ఒకే చిరునామాపై ఎక్కువ ఓట్లు వంటి అంశాలపై ప్రతేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. వచ్చే అక్టోబరు 29 న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. వీటిపై సవరణలు, అభ్యంతరాలకు నవంబరు 28 వరకు స్వీకరిస్తారని, డిసెంబరు 24 లోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వచ్చే జనవరి 6వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఇంటింటి సర్వే చాలా ముఖ్యమని, ఇ.ఆర్.ఓ., ఎఇఆర్, సూపర్వైజర్ల పర్యవేక్షణలో బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే చేపడతారని, ఇందుకోసం నియోజక వర్గ స్థాయిలో మాస్టర్ ట్రైనర్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, బూత్ లెవల్ ఆఫీసర్ వద్ద ఎలక్టోరల్ జాబితా, పోలింగ్ స్టేషన్ మ్యాప్, విఐపి ఓటర్ల వివరాలు ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బూత్ లెవల్ ఆఫీసర్లు తమ ఉన్న బి.ఎల్.ఓ. యాప్ లో ఓటర్ల వివరాలను నమోదు చేయడం జరుగుతుందని తెలియచేస్తూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి సూచనలు, అభిప్రాయాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఓటు హక్కు నమోదు కోసం 18 సంవత్సరాలు నిండబోయే యువత వివరాలను బూత్ లెవల్ అధికారుల ద్వారా ముందుగానే సేకరించడం జరుగుతుందని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్సు లో ఆర్ డి ఓ వాసు చంద్ర, జిల్లా స్తా యి, అసెంబ్లీ  స్థాయి, మాస్టర్ ట్రైనర్స్ , ఎనికల విబాగము సుపరిండెంట్ నేమత్ అలీ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.