అనంతగిరి డెస్క్ : ఖగోళంలో మరో అద్భుతాన్ని వీక్షించే అవకాశం.. బుధవారం రాత్రి 9 గంటల తర్వాత ఆకాశంలో కాంతులు వెదజల్లుతూ జెమినిడ్స్ ఉల్కాపాతం జరగబోతున్నట్లు ప్లానెటరీ సొసైటీ, ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, డైరెక్టర్ ఎస్.రఘునందన్రావు తెలిపారు. దీన్ని మామూలు కంటితోనే చూసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇసుక రేణువంత ఉండే ఈ ధూళి రేణువులు భూ వాతావరణాన్ని తాకి కాంతిజ్వాలగా కాలిపోతాయన్నారు. దీన్నే మనమంతా ఉల్కాపాతం అంటామని చెప్పారు.
దీన్ని బుధవారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఈశాన్యం, తూర్పు వైపు.. మధ్యరాత్రిలో ఆకాశంలో నడినెత్తిన.. సూర్యోదయానికి ముందు పడమర వైపు చూడవచ్చని తెలిపారు. ఇలా డిసెంబరు 17 వరకు కనిపిస్తాయన్నారు. పౌర్ణమి తర్వాత ఏర్పడుతుండటంతో గంటకు 150కిపైగా మెరుపులు వస్తాయని.. మనం 30-40 మాత్రమే చూడగలుగుతామని చెప్పారు.