213 ఎకరాలలో అనంతగిరి గుట్టను ఈకో టూరిజం:జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

0
25 Views

వికారాబాద్:213 ఎకరాలలో అనంతగిరి గుట్టను ఈకో టూరిజం క్రింద అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులు, ఎల్ అండ్ టి ప్రతినిధులతో ఈకో టూరిజం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతగిరి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి కొరకు 213 ఎకరాల విస్తీర్ణంలో పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో కాటేజీలు, రోడ్లు, పార్కింగ్, కన్వెన్షన్ సెంటర్, ట్రాకింగ్ పాయింట్, అడ్వెంచర్ టూరిజం లాంటి ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనితో పాటు అనంతగిరి పద్మనాభ స్వామి దేవస్థానం, సర్పన్  పల్లి ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. కోటిపల్లి ప్రాజెక్టుతో సమానంగా సర్పన్ పల్లి ప్రాజెక్టును కూడా టూరిజంలో భాగంగా అభివృద్ధి పరచాలన్నారు. హైదరాబాద్ నుండి అనంతగిరి 80 కిలో మీటర్ల దూరంలో ఉన్నందున, పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, రోజుకు కనీసం 5000 మంది పర్యాటకులు సందర్శించవచ్చని, 1000 మంది వరకు రాత్రిపూట బస చేసే అవకాశం ఉన్నందున, దీనికి తగ్గట్టుగా పార్కింగ్ తో పాటు అవసరమైన మరుగుదొడ్లు, త్రాగునీరు, విద్యుత్తు లాంటి అన్ని సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సంబంధిత అధికారులు, ఎల్ అండ్ టి ప్రతినిధులతో కలిసి చేపట్టాల్సిన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్, టూరిజం అధికారి హనుమంతరావు, మిషన్ భగీరథ గ్రిడ్ ఈ ఈ చలమారెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి మాధవిలతో పాటు ఎల్ అండ్ టి ప్రాజెక్టు మేనేజర్ సుమలత వారి బృందం సభ్యులు పాల్గొన్నారు.