సమాజ మార్పులో భాగంగా ప్రజల్లో సమానత్వాన్ని పెంపొందించాలి:స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
217 Views

వికారాబాద్:సమాజ మార్పులో భాగంగా ప్రజల్లో సమానత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షన జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ , ఎస్టీల అత్యాచారాల కేసులకు సంబంధించిన విషయాలపై సమీక్షించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సభాపతి మాట్లాడుతూ… నేర ప్రవృత్తి, వివక్షకు తావులేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు పరచాలని ఆయన తెలిపారు. అత్యాచార కేసులకు సంబంధించి పోలీస్ అధికారుల సహకారం తీసుకుంటూ సమన్వయంతో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డివిఎంసి సభ్యులకు సూచించారు. దళితులు ఎలాంటి వివక్షకు గురికాకుండా, వారిలో మనస్తర్యాన్ని పెంపొందించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ప్రాముఖ్యతను కళాబృందాల ద్వారా అవగాహన కల్పించాలని ఆయన అధికారులు సూచించారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావునీయకుండా నిష్పక్షపాతంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని అతి తొందరలో ఇవ్వడం జరుగుతుందని సభాపతి హామీ ఇచ్చారు. జిల్లాలో కేసులను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా డివిఎంసి సమావేశాలు నిర్వహించాలని సభాపతి అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామాల్లో సూచిక బోర్డులను ప్రదర్శింపచేయాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి సమస్యల పరిష్కారానికి పోలీస్, రెవెన్యూ అధికారులు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఎస్సీ , ఎస్టీల భూ సమస్యలపై దృష్టి సారించి పరిష్కార దిశగా పనిచేయాలని సభాపతి సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుధీర్ , డిఏస్సిడిఓ మల్లేశం, డిబీసీడిఓ ఉపేందర్, డిటిడిఓ కమలాకర్ రెడ్డి, డిఎఫ్ఓ వెంకన్న, డీఎస్ఓ మోహన్ బాబు, కమిటీ సభ్యులు అనంతయ్య, జగదీష్, దస్తప్ప, కిరణ్ రోనాల్డ్, సురెందర్ లు పాల్గొన్నారు.