శేరిలింగంపల్లి: తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పిస్తే, మోడీ సర్కారు బాధలు ఫ్రీగా కల్పిస్తుందని వాపోయారు. కాంగ్రెసు ప్రభుత్వంతో సంక్షేమం గ్యారెంటీ అని చెప్పగా, బీజేపీ వస్తే సంక్షోభం గ్యారెంటీ అని చెప్పారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్కు అన్యాయంగా ఢిల్లీ పోలీసులతో నోటీసులను ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నందుకే రేవంత్రెడ్డిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. ఒక్కసారి జైలుకు పంపినందుకే రేవంత్… ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని… మరి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు తీసుకెళితే, ఇంకెంత స్థాయికి వెళతారో చూడాలన్నారు. తమకు గతంలో అండగా ఉన్నానని, ఇప్పుడు గెలిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మీకు మరిన్ని సేవలందిస్తానని తెలిపారు. గతంలో ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ ప్రాంతానికి ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. కరోనా సమయంలో ఆయన ఇంటి నుంచి బయటకే రాలేదని విమర్శించారు. శానిటైజర్ పూసుకుని ఇంట్లో పడుకున్నారని చెప్పారు. ఆయన ఏ ఒక్కరికీ అపాయింట్మెంట్ ఇవ్వరని తెలిపారు. తాను మీకు తలలో నాలుకలా ఉంటానని… కష్ట నష్టాల్లో పాలుపంచుకుంటానన్నారు. అందుకే ఈ చేవెళ్ళ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని కోరారు.
చేవెళ్లకి టైం ఇస్తున్న రేవంతన్నకు థ్యాంక్స్
తమ చేవెళ్ళ కోసం ఇన్ని గంటలు టైం ఇస్తున్న రేవంత్ అన్నకు థ్యాంక్స్ చెప్పారు. తమ కోసం ఇన్నిగంటలపాటు ఓపిగ్గా ఎదురు చూసిన అక్కలకు, అన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఓపికతో ఈనెల 13న కచ్చితంగా హస్తం గుర్తుకే ఓటేసి, తనను గెలిపించాలన్నారు.