కొండా తిరిగింది ఊర్లు కాదు… టూర్లు: కాంగ్రెస్​ అభ్యర్థి డాక్టర్​ జి. రంజిత్​ రెడ్డి ఫైర్​

0

రంగారెడ్డి: బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి గత ఐదేండ్లు తిరిగింది చేవెళ్ళలోని ఊర్లు కాదని… టూర్లు అని కాంగ్రెస్​ అభ్యర్థి డాక్టర్​ జి. రంజిత్​ రెడ్డి ఎద్దేవా చేశారు. కరోనా లాంటి విపత్తు యావత్​ ప్రపంచాన్ని, చేవెళ్ళ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తే… ఆయన ఇంట్లో పడుకొని ఎన్నికలప్పుడు మాత్రం బయటకు వచ్చి హడావుడి చేస్తున్నారని ఆగ్రహించారు. కొత్తగా సోషల్​ మీడియాలో ఛాలెంజిల పేరుతో చవట ముచ్చట్లు చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికలంటే ఛాలెంజిలు కాదు ప్రజాసేవ అని తెలుసుకోవాలని కొండాకి హితవు పలికారు. ఆదివారం రంజిత్​ రెడ్డి శేరిలింగంపల్లి, చేవెళ్ల ప్రాంతాల్లో జరిగిన వికలాంగుల సమావేశం, కార్నర్​ మీటింగ్​, గెటేడ్​ కమ్యూనిటీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజిత్​ రెడ్డి మాట్లాడారు. కొండా విశ్వేశ్వర్​ రెడ్డి కోవిడ్ టైంలో ఆయన సొంత ఇంటి గడప దాటిండా? అని ప్రశ్నించారు. దర్వాజలేసుకుని శానిటైజర్ ఎట్ల రుద్దుకోవాల్నో వీడియోలు చేసుకుంటూ కూసుకున్నడు… కానీ తాను ప్రతి గడపకి నిత్యవసర వస్తువులు, మందులు, పిల్లలు చదువుకోవడానికి టీవీలు ఇచ్చుకుంటూ నియోజకవర్గంలోనే తిరిగిన అని చెప్పారు. ఆయన మామ, ఆయన భార్య వాళ్ల అపోలో హాస్పిటల్కు కోవిడ్ టైంలో బిల్లులకు లిమిట్లు పెట్టొద్దు అని పర్మిషన్ కోసం తిరిగిర్రని గుర్తు చేశారు. కోవిడ్ లాంటి భయంకరమైన కష్టం వచ్చినప్పుడు… పబ్లిక్ ను ఎట్ల ఆదుకోవాల్నా అని తాను ఆలోచించిన అని… ఆల్లేమో ఇదే సందని జనాల ప్రాణాల మీద పైసలు వసూలు చేసుకున్నరని విమర్శించారు. ఎలక్షన్ల ఆరు నెలల ముందు నిద్రలేచి… చెడ్డీలు ఏస్కొని స్విమ్మింగ్ చేసి, గుట్టలెక్కి.. నియోజకవర్గ పర్యటన ముగిసింది అని చెప్పుకుంటడని మండిపడ్డారు. హైదరాబాదులో ఉన్న లక్షల మంది వీకెండ్ రోజు చేవెళ్ళ చుట్టుపక్కలకు పిక్నిక్ కోసం వచ్చి పోతుంటరు.. ఈన ఐదేళ్ల కోసారి వచ్చి పోతుంటడు అంతే తేడా అని గుర్తు చేశారు. పబ్లిక్కు ఆయనే ఒక ఛాలెంజ్… ఐదేళ్ల కోసారి వస్తడు మనిషి.. తిరుగుతడు.. ఒక్కోసారి ఒక్కో కండువా వేస్కుని వస్తడు.. ఈ మనిషి ఎవరు అని వాళ్ళకి ఆయన ఒక పెద్ద చాలెంజ్ అని చెప్పారు. ఆయనకు పబ్లిక్ కూడా ఒక ఛాలెంజే.. ఎందుకంటే మనుషులు గుర్తు ఉండరు, ఊర్ల పేర్లు గుర్తుండయి వివరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు కూడా తెలియవని చెప్పారు. ఆయనకు నామినేషన్ ఏశి ఎలక్షన్లకు పోవుడు అంటే… ఎంట్రీ టికెట్ తీసుకొని పిక్నిక్ కోసం పార్కుకు పోయినట్టే… కానీ నాకు మాత్రం… చేవెళ్ల అంటే ఒక వసుధైక కుటుంబాన్ని కలిసినట్టని చెప్పారు. అభివృద్ధే తన మంత్రమని చెప్పారు.

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్​ పోతయ్​!

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దు అవుతాయని చేవెళ్ళ కాంగ్రెస్​ అభ్యర్థి రంజిత్​ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి పార్టీకి చేవెళ్ళ ప్రజలు తమ ఓటు హక్కుతో బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. భారతదేశం ఏమైపోతుందోనన్న ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోందన్నారు. రాబోయే పది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, చేవెళ్ళ ప్రజలు విజ్ఞతతో, వివేకంతో, ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. చేవెళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటు వేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూల గాలి వీస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల పట్టుకొమ్మలు రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో క్రియాశీల పాత్ర వహించాలని కోరారు. బీజెపి చేస్తున్నటువంటి మోసపూరితమైన హామీలను ప్రజలకు వివరించాలని సూచనలు చేశారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం రైతు రుణమాఫీతో పాటు అన్ని గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు.