కొంపల్లి చెరువులో పడి వ్యక్తి మృతి

0
132 Views

వికారాబాద్: వినాయకులకు ఉన్న సికులను తీసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మోమిన్ పేట మండలం దుర్గం చెరువు గ్రామానికి చెందిన పెద్ద గొల్ల అనంతయ్య (42) గత కొన్ని రోజులుగా వికారాబాద్ పట్టణం కొత్తగాడిలో స్థిరపడి భార్య పిల్లలతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి పలు వినాయకులు కొంపల్లి చెరువులో నిమజ్జనం కాగా బుధవారం అనంతయ్య చెరువులోకి దిగి సీకులను తీసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే అనంతయ్య నీట మునిగే మృతి చెందాడు. గురువారం అటుగా వెళుతున్న కొంపల్లి వాసులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.