ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వినయ్ కుమార్

0
17 Views

వికారాబాద్:సంప్రదాయ చేతి వృత్తుల వారిని, హస్తకళాకారులను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తూ, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వినయ్ కుమార్ సూచించారు.గ్రామీణ ప్రాంతానికి చెందిన అర్హులైన ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పీ.ఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కల్పించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్), జిల్లా పరిశ్రమల కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ పథకం ఉద్దేశ్యాలు, ప్రయోజనాలను అయన వివరిస్తూ, అర్హులైన విశ్వకర్మలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు మీసేవ కేంద్రాలు లేదా గ్రామపంచాయతీ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంకు వివరాలతో పాటు రేషన్ కార్డు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. కమ్మరులు, స్వర్ణకారులు, వడ్రంగులు, శిల్పులు, స్వర్ణకారులు, చెప్పులు కుట్టేవారు, బుట్టలు, చాపలు, చీపుర్లు తయారు చేసేవారు, దర్జీలు, చేపల వలలు తయారు చేసేవారు, పూలదండలు తయారు చేసేవారు, చర్మకారులు, రజకులు, ఆయుధాలు తయారు చేసేవారు, చేతి వృత్తుల హస్త కళాకారులు వంటి 18 కేటగిరీలలో పని చేస్తున్న వారు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా స్వయం ఉపాధి ఏర్పర్చుకోవాలనుకునే చేతివృత్తిదారులు, హస్త కళాకారులకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ఏ కులానికి సంబంధించిన వారైనా సరే, ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. పీ.ఎం విశ్వకర్మ యోజన కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి నైపుణ్యం మెరుగుదల కోసం 7 రోజుల నుండి 15 రోజుల వరకు శిక్షణ అందించడం జరుగుతుందని, శిక్షణ కాలంలో రోజుకు 500 రూపాయల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారని వివరించారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డు జారీ చేయబడుతుందన్నారు. లబ్ధిదారులకు రుణ సహాయం కింద రెండు విడతలుగా మొత్తం మూడు లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని, మొదటి విడత కింద లక్ష రూపాయలు, రెండవ విడత కింద రెండు లక్షల రూపాయలను అందించడం జరుగుతుందని తెలిపారు. లబ్దిదారులు రాయితీ వడ్డీ రేటు కేవలం ఐదు శాతంపై రుణ సదుపాయం పొందవచ్చని అయన సూచించారు. విశ్వకర్మలు తయారుచేసే వస్తువులకు సరైన మార్కెటింగ్ వసతి లభించేలా ఎం.ఎస్.ఎం.ఈ కృషి చేస్తుందని అన్నారు. ఇలా అనేక ప్రయోజనాలతో కూడుకుని ఉన్న పీ.ఎం విశ్వకర్మ పథకం గురించి గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందేలా చొరవ చూపాలని సి.ఎస్.సి కేంద్రాల ఆపరేటర్లు, గ్రామ పంచాయతీల కార్యదర్శులను కోరారు.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. అయితే, గత 5 ఏళ్లలో స్వయం ఉపాధి/వ్యాపార అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రుణాలు తీసున్న వారు ఈ పథకానికి అర్హులు కాదన్నారు. ముద్ర, స్వనిధి పథకాల లబ్ధిదారులు తమ రుణాలను చెల్లించినట్లైతే ఈ విశ్వకర్మ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకం కుటుంబంలోని ఒకరికి మాత్రమే వర్తిస్తుందని, ప్రభుత్వ సర్వీసులో ఉన్న వ్యక్తికి/కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తించదన్నారు.ఈ అవగాహన సదస్సులో ఎం.ఎస్.ఎం.ఈ అసిస్టెంట్ డైరెక్టర్ సుధీర్ కుమార్, ఎస్ బి ఐ రిజినల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ (క్రెడిట్) వికాస్ సాహూ, ఎల్ డి ఎం రాంబాబు, మెప్మా పిడి రవికుమార్, జిల్లా బీ.సీ సంక్షేమ శాఖ సహాయ అధికారి భీమ్ రాజు, సి.ఎస్.సి ఆపరేటర్లు, ఔత్సాహిక విశ్వకర్మలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.