తరాలు మారినా చరిత్రలో గుర్తుండి పోయే సర్పంచులు:మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

0
15 Views

వికారాబాద్ : తరాలు మారినా.. యుగాలు గడిచినా.. చరిత్రలో గుర్తుండిపోయే సర్పంచులు మీరు అని పదవీ విరమణ చేసిన సర్పంచులను ఉద్దేశించి రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవీ కాలం ముగింపు పురస్కరించుకొని సర్పంచుల సేవలు గుర్తు చేస్తూ ఆమె గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.  ప్రగతి ఫలాలను పల్లెలకు చేర్చడంలో, అభివృద్ధి పరచడంలో మీరు ఎంతో కృషి చేశారంటూ ఆమె సర్పంచులను అభినందించారు. నర్సరీలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, ట్రాలీలు ట్యాంకర్లు, ట్రాక్టర్లు, వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాలు, రైతు వేదికలు, స్వచ్ఛ గ్రామాల సృష్టికర్తలని కొనియాడారు. గ్రామాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ.. భవిష్యత్తుకు బాటలు వేస్తూ.. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా తీర్చిదిద్దారన్నారు. అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు ఆమె అభినందనలు తెలిపారు.