లక్ష్యాలకు అనుగుణంగా సీఎంఆర్ ను నిర్ణీత సమయంలో డెలివరీ చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

0
280 Views

వికారాబాద్ : లక్ష్యాలకు అనుగుణంగా సీఎంఆర్ ను నిర్ణీత సమయంలో డెలివరీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ మిల్లర్లకు సూచించారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సీఎంఆర్ డెలివరీలో ఆలస్యంపై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల డిప్యూటీ తహసిల్దార్లతో జిల్లా అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిల్లు పట్టిన బియ్యాన్ని (సీఎంఆర్) ఎఫ్.సి.ఐ కి నిర్ణీత సమయంలో చేరవేయడంలో అలసత్వం వహించకూడదన్నారు. 2021-22 ఖరీఫ్ సీజన్ సంబంధించి సీఎంఆర్ ను ఆగస్టు 15 లోపు అందించాలని ఆయన తెలిపారు. అదేవిధంగా 2022-23 ఖరీఫ్ సీజన్ కి సంబంధించి సెప్టెంబర్ మొదటి వారంలోగా సీఎంఆర్ ను ఇచ్చేలా మిల్లర్లు కృషి చేయాలని తెలిపారు. మిల్లర్లు నిర్ణీత సమయానికి సీఎంఆర్ ను ఇవ్వకపోవడం వల్ల సమయాన్ని పెంచుతూ పోవడం సరి అయిన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మిల్లర్ల యాజమాన్యాలు, యూనియన్ నాయకులు కలిసి ఒక్క తాటి పైకి వచ్చి సీఎంఆర్ ను నిర్ణీత గడువులోగా పూర్తి అయ్యేలా చూడాలని ఆయన తెలిపారు. రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులు సమిష్టిగా పని చేస్తూ సీఎంఆర్ లక్ష్యాలను అధిగమించాలని ఆయన సూచించారు.
జిల్లాలో ఉన్న రైస్ మిల్లులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ లక్ష్యాలకు అనుగుణంగా మిల్లింగ్ అయ్యేలా డిప్యూటీ తహసీల్దారులు తమ కార్యచరణను రూపొందించుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. డిప్యూటీ తాసిల్దారులు తమ రోజువారి టూర్ డైరీలలో ఏఏ మిల్లులను సందర్శించారో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, జిల్లా మేనేజర్ సుగుణ బాయ్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు బాలేశ్వర్ గుప్తా, కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, పౌరసరఫరాల డిప్యూటీ తహసిల్దార్లు పాల్గొన్నారు.