మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని విద్యా బోధన చేయాలి: శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

0
165 Views

వికారాబాద్ : మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని విద్యా బోధన చేయాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు.
గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి, వందేమాతర గీతం ఆలాపనతో కార్యక్రమాన్ని ప్రాంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 39 మంది ఉపాధ్యాయులకు శాలువా, మెమోంటో, ప్రశంస పత్రాలతో శాసనమండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి, పరిగి, తాండూర్, చేవెళ్ల శాసనసభ్యులు టి. రామ్మోహన్ రెడ్డి, బి. మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి లతో కలిసి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లు విద్యా ప్రాముఖ్యతను గుర్తించి ఎన్నో అద్భుతాలను సృష్టించారన్నారు. ఆ మహానీయులను స్మరించుకుంటూ విద్య పట్ల ఆసక్తిని పెంచాలని సభాపతి తెలిపారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అనే నానుడి ఉంది అంటే ఉపాధ్యాయుల పట్ల సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఏ దేశ భవిష్యత్తు అయిన తరగతి గదుల్లోనే ప్రారంభమవుతుందని, సమాజానికి ఉపయోగపడే గురువుకు మన సమాజంలో ఎంతో గుర్తింపు ఉంటుందని, జీవితాలను మలుపుతిప్పే శక్తి గురువులకే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మనకు విద్యాబోధనలు అందించి, మన ఎదుగుదలకు కారకులైన గురువులను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ… తను చదువుకున్న రోజుల్లోనీ జోసెఫ్, లెక్కల మాస్టారును స్పీకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పాఠశాల స్థాయి నుండి విద్యాబుద్ధులను నేర్పించి ఆర్థికంగా, రాజకీయంగా, ఉన్నత స్థాయి ఉద్యోగులుగా తీర్చి దిద్దిన ఘనత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 26 వేల పాఠశాలల్లో 20 లక్షల మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని, ఇందులో ఎక్కువగా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకుంటారని ఆయన తెలిపారు.
విద్యాభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్లో 21 వేల కోట్ల నిధులను కేటాయించడం జరిగిందని స్పీకర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో 20 ఎకరాలకు స్థలానికి తగ్గకుండా భూములను ఎంపిక చేసి సమీకృత పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని ఆయన అన్నారు. ప్రైవేటు రంగాలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం విద్య, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ.. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి దిశగా తీసుకు వెళ్లేందుకు త్రిసభ్య విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమలు నెల కోల్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారని, పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగ యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు. ఆడపిల్లలు కూడా విద్య పట్ల ఆసక్తిని పెంచుకోవడంతో పాటు ఉద్యోగాల్లో రాణించేందుకు ముందుకు రావాలని స్పీకర్ సూచించారు.

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ… జీవితంలో విద్యకు మించింది ఏది లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, మార్పులకు అనుగుణంగా తమ జీవితాలను గొప్పగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. దేశ రూపు రేఖలు మార్చాలంటే విద్య వల్లనే సాధ్యమని చెప్పిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలను కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనకు మొట్టమొదటి గురువు తన తల్లియేనని ఆయన అన్నారు. జిల్లాలోని 951 పాఠశాల ఉండగా ఇప్పటికే 250 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని , మిగతా పాఠశాలలో పనులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలిపారు.

శాసనమండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే ముందు బాగానా నిలుస్తారని తెలిపారు. ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ లో చేసిన ఘనత ఉపాధ్యాయులదేననిఆయన అన్నారు.

జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ… సమాజంలో మనము ఎంతటి స్థాయిలో ఉన్నప్పటికీ అలా ప్రభావితం చేసిన ఉపాధ్యాయులే గొప్పవారు అన్నారు. ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి చదువు వంటి ఆస్తివలెను ఇతర దేశాల్లో కూడా భారతీయులు మెరుగ్గా పనిచేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పరిగి శాసనసభ్యులు టి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకువచ్చే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల భాగంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించే పనులను మహిళా సంఘాలతో చేపట్టినట్లు ఆయన తెలిపారు.

చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ… ప్రతి ఒక్కరము విద్యార్థి దశ నుండే వచ్చినవారమని, ఉపాధ్యాయులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైనదిగా భావించి విద్యార్థుల అభ్యున్నతికి తమ శాయశక్తుల పని చేయాలని ఆయన కోరారు.

తాండూరు శాసనసభ్యులు బి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… విద్యార్థులను అత్యున్నత స్థాయిలో చేర్చేది ఉపాధ్యాయులేనన్నారు. ఉపాధ్యాయ వృత్తి అంటే గౌరవానికి ప్రతీక అని తెలిపారు.

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో వికారాబాద్ ఆర్డీవో వాసు చంద్ర, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.