ఘనంగా కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

0
376 Views

వికారాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమాని సభపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందన్నారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే విధంగా ఇందిరమ్మ గ్రామసభలు నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆడపడుచులు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాలో 1 కోటి 54 లక్షల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాని వినియోగించుకున్నారని దీన్ని ద్వారా 56 కోట్ల రూపాయల లబ్ధి చేకోరిందని స్పీకర్ తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు, పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచి అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా వికారాబాద్ జిల్లాలో 2,836 మంది పేదలకు చికిత్సలు చేయడం జరిగిందన్నారు.
నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచి ఈ ఒక్క సంవత్సరంలోనే 4 లక్షల 50 వేల గృహాలు నిర్మించి తలపెట్టినట్లు ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3500 గృహాలు నిర్మించడం జరుగుతుందని ఆయన అన్నారు. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరాలో భాగంగా జిల్లాలో లక్ష 20 మందికి లబ్ధి చేకూరుతుందని ఇప్పటికే 66,682 మంది వినియోగదారులకు కోటి 73 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. గృహ జ్యోతి కార్యక్రమంలో భాగంగా 1,25, 721 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, 9 కోట్ల 8 లక్షల రూపాయల సబ్సిడీని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ లో భాగంగా జిల్లాలని 1,09269 మంది రైతన్నలకు 905 కోట రూపాయల రూపాయల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తి గావించడం జరిగిందని ఆయన అన్నారు. రైతు భీమా పథకం ద్వారా 5829 మంది మరణించిన రైతు కుటుంబాలకు 291.45 కోట రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. వ్యవసాయ రంగానికి వాన కాలంలో 75,437 మెట్టు టన్నుల ఎరువులు అవసరం కాగా ఇప్పటివరకు 30,320 మెట్టి టన్నుల ఎరువులు సరఫరా చేయడం జరిగిందని, ఇంకను 15663 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. రైతు వేదిక ద్వారా రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వివిధ అంశాలపై శాస్త్రవేత్తల ద్వారా రైతులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం ద్వారా ఈ సంవత్సరం 830 ఎకరాలలో 2 కోట్ల 40 లక్షల వ్యయంతో పండ్ల, కూరగాయలు, పూల తోటల ఉత్పత్తిని పెంచేందుకు ఆయన అన్నారు.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు వివిధ మరమ్మత్తుల పనులు చేపట్టేందుకు 8 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ 1062 పాఠశాలలను గుర్తించి ఇప్పటికీ 924 పాఠశాలల్లో పనులు ప్రారంభించడం జరిగిందని, ఇందులో 202 పాఠశాలల్లో అన్ని రకాల పనులు పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
జిల్లాలో ఆహార భద్రత, అంత్యోదయ , అన్నపూర్ణ పథకాల ద్వారా 5337 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 588 చౌక ధర దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

గ్రామీణ పేదరిక నిర్మూలనలో భాగంగా మహిళా సంఘాలకు శ్రీనిధి బ్యాంక్ ద్వారా 216 సంఘాలకు 5 కోట్ల 56 లక్షల రూపాయల రుణము ఇవ్వడం జరిగిందని అదేవిధంగా 1447 సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 13,869 లక్షల రుణాలు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 3527 మంది మహిళల నిమిత్తం 23.41 రూపాయలకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని ఆయన అన్నారు. వృద్ధాప్య, వితంతు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి, ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు జిల్లాలో 26 కోట్ల 36 లక్షల రూపాయల పెన్షన్లతో 1 లక్షా 10 వేల మంది లబ్ధి పొందుతున్నారని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా లక్ష కుటుంబాలకు 1 లక్షా 82 వేల మంది కూలీలకు పని దినాలు ఉన్నికల్పించి 137 కోట్ల రూపాయల చెల్లింపులు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ మిషన్ నష్టాలు తగ్గించి నెట్వర్క్ బలోపేతం చేసుకోవడానికి 9 కోట్ల 74 లక్షల రూపాయల వ్యయంతో 9 అదనపు సామర్థ్యం గల మాస్ ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

జిల్లాలోని అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన కోటిపల్లి ప్రాజెక్టు స్తిరీకరించి 9,200 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదన రూపొందించడం జరిగిందని తెలిపారు. ఉద్దండపూరు ఎడమ ప్రధాన కాలువ 10వ కిలో మీటర్ నుండి 122.3 కిలోమీటర్ వరకు 1470 కోట్ల రూపాయలతో మంజూరు చేయబడిన పనులు పురోగతిలో ఉన్నాయని ఆయన అన్నారు.
స్వచ్ఛతను పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి వన మహోత్సవం కింద 40.48 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా ఉండడంతో ఇప్పటివరకు 27.15 లక్షలు మొక్కలు వివిధ శాఖల ద్వారా నాటడం జరిగిందని ఆయన తెలిపారు.

షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, తరగతులు, మైనార్టీ శాఖల ద్వారా ఫ్రీ మరియు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో 11, 533 మందికి వసతి కల్పించడంతోపాటు 9,154 మంది విద్యార్థులకు ఫ్రీ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 5 కోట్ల 24 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. తాండూరు పరిగి నియోజకవర్గం లోని 120 మంది చదువుకున్న నిరుద్యోగ ఎస్సీ మహిళకు భయం ఉపాధి పథకం కింద స్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా కుట్టు మిషన్ లు ఇవ్వడం జరిగిందని ఇందుకు 30 లక్షలు ఖర్చు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. బీసీ కులవృత్తి దారులకు, అత్యంత వెనుకబడిన తరగతుల వారికి ప్రతి నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారుల చొప్పున 1400 మందికి 14 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మైనార్టీ శాఖ ద్వారా 72 ఈద్గాలు, స్మశాన వాటిక లకు 5 కోట్ల ఆరు లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, 24 క్రైస్తవ సంస్థలకు మరమ్మత్తుల నిమిత్తం 2 27 కోట్లు మంజూరు చేసి చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు.
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రులు నిర్వహించి 7911 మంది మహిళలను పరీక్షించి చికిత్సలు చేయడం జరిగిందన్నారు.

బాల బాలికలకు పౌష్టికారాన్ని అంకితం తో పాటు బాల బాలికలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు విద్యను అందించాలని సంకల్పంతో అంగన్వాడి కేంద్రాలను ఫ్రీ స్కూల్స్ గా మార్చలేని నిర్ణయించడం జరిగిందని సభాపతి అన్నారు. జిల్లాలోని 1107 అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, బాలింతలు, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకు వివిధ సేవలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దివ్యాంగులను వివాహం చేసుకున్న 10 మందికి 10 లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు.

పంచాయతి రాజ్ శాఖ ద్వారా వివిధ పథకంల కింద 6974 పనులకు గాను 833 కోట్ల 22 లక్షల రూపాయలు మంజూరు కాగా ఇప్పటివరకు 4125 పనులు 277 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తిచేయడం జరిగిందని మిగతా పనులన్నీ పురోగతిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు వీలుగా రెన్యువల్ చేయడానికి 270 కోట్ల రూపాయలను మంజూరు చేసి 106 పనులను చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. సింగిల్ లైన్ నుండి డబుల్ లైన్ రహదారులు వెడల్పు చేసేందుకు 7 పనులకు గాను 150 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని ఆయన అన్నారు. 14 కొత్త వంతెనల నిర్మాణ పనులకు గాను 91 కోట్ల రూపాయలు అయ్యి వివిధ పనులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలిపారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కింద 996.36 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని వీటి ద్వారా నర్సింగ్ , ఫిజియోథెరపీ, పశు వైద్య కళాశాలల ఏర్పాటుతోపాటు బ్రిడ్జిలు, వ్యవస్థకు సంపాదించిన సమీకృత భవన నిర్మాణం, అతిథి గృహాల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

వికారాబాద్ ను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు యువకులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని స్పీకర్ అన్నారు. గంజాయి, పదార్థాల వ్యాపారం చేసిన, సేవించిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని, ఇప్పటివరకు జిల్లాలో 73 కేసులలో 140 కిలోల గంజాయిని సీజ్ చేసి 148 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మహిళలు , విద్యార్థుల రక్షణ కొరకు షీ టీం బృందాలను సబ్ డివిజన్ల వారిగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా పోకిరీలు మహిళలను వేధించినట్లయితే 100 నెంబర్ కు దయచేసి సమాచారం అందించాలని ఆయన కోరారు.

అనంతగిరి పర్యాటక అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో స్వదేశీ దర్శన్ పథకంలో 110 కోట రూపాయలు చేయడం జరిగిందని ఇందులో భాగంగా కోట్ పల్లి , సర్పంచ్ పల్లి ప్రాజెక్టులు , బుగ్గ రామేశ్వరంలు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాయని ఆయన అన్నారు.

మున్సిపల్ పరిధిలోని మహిళా సంఘాలకు 18.75 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, గ్రామీణ మహిళా సంఘాలకు 52 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను స్పీకర్ అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో (10/10) ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు 1000 రూపాయల నగదు పారితోషికాన్ని స్పీకర్ అందజేశారు. పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ పత్రాలను, ఉత్తమ సేవలందించిన అధికారులకు, సిబ్బందికి స్పీకర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన బాల బాలికలకు స్పీకర్ చేతుల మీదుగా మెమొంటోలను అందజేశారు.

కలెక్టరేట్ ఆవరణలో వివిధ శాఖలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను సభాపతి, జిల్లా కలెక్టర్ లు, అదనపు కలెక్టర్, ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి,  అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి , పరిగి , తాండూర్ శాసన సభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి , బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.