
ఏప్రిల్ 25న కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తా: కల్వకుంట్ల కవిత
Advertisement
నిజామాబాద్, మార్చి 27: కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా మార్చి, ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో పార్టీ జెండా, అజెండాను ప్రకటించనున్నట్లు తెలిపారు.శుక్రవారం నిజామాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, ప్రజల సమస్యల పరిష్కారానికి కొత్త రాజకీయ పార్టీ అవసరమని పేర్కొన్నారు. మహిళలు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మేధావులు పార్టీ ఆవిర్భావ సభకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. “తెలంగాణ ఇంటి పార్టీగా, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం. మేము ఎవరికీ బీ టీమ్ కాదు, రాష్ట్రంలో నంబర్ వన్ పార్టీగా ఎదుగుతాం” అని స్పష్టం చేశారు. సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ప్రజల అభిప్రాయాలతో ప్రాక్టికల్ అజెండా రూపొందిస్తున్నామని తెలిపారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువత సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. రాజకీయాల్లో ఈగో ఉండకూడదని, తెలంగాణ కోసం పనిచేయాలనుకునే వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఏ పని చేపట్టినా ఫలితం వచ్చే వరకు వదిలిపెట్టను. ఢిల్లీలో లాబీయింగ్ చేయగలను, గల్లీలో కష్టపడగలను” అని కవిత పేర్కొన్నారు.
Share this article


