
క్లీన్ చీట్ ఇవ్వడం అప్రజాస్వామ్యం: డాక్టర్ మెతుకు ఆనంద్
Advertisement
వికారాబాద్: దానం నాగేందర్, కడియం శ్రీహరికి పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి క్లీన్ చీట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి కూడా క్లీన్ చీట్ ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు. పార్టీ మార్పులను నియంత్రించాల్సిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారికి మద్దతు పలుకుతూ అనర్హత పిటిషన్ను కొట్టివేయడం రాజకీయ నైతికతకు విరుద్ధమని పేర్కొన్నారు. గతంలో నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు సంబంధిత ఎమ్మెల్యేలు స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని, పలువురు సమావేశాల్లో కూడా పార్టీ మారినట్లు ఒప్పుకున్నారని గుర్తుచేశారు.పార్టీ కండువా కప్పుకుని కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసినప్పటికీ వారికి క్లీన్ చీట్ ఇవ్వడం ఎలా సాధ్యమైందని ఆయన ప్రశ్నించారు. సీఎం చేతిలో స్పీకర్ కీలుబొమ్మగా మారారని, సాంకేతిక కారణాలు చూపిస్తూ క్లీన్ చీట్ ఇవ్వడం ద్వారా శాసనసభాపతి పదవికి కళంకం తెచ్చారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం నేర్పిస్తారని డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు.
Share this article


