
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి: సర్పంచ్ శ్వేత
Advertisement
వికారాబాద్: మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నప్పటికీ సమాజంలో పూర్తి స్థాయి సమానత్వం ఇంకా సాధ్యపడలేదని, దీనికి ప్రధాన కారణం జెండర్ అసమానతలేనని పులుమద్ది గ్రామ సర్పంచ్ శ్వేత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు..ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్వేత మాట్లాడుతూ తమ గ్రామపంచాయతీలో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా మహిళలు విద్య, రాజకీయ రంగాల్లో మరింతగా రాణించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటి నుంచే సమానత్వంపై అవగాహన ప్రారంభం కావాలని, ఆడపిల్లలు–మగపిల్లలు ఇద్దరికీ ఇంటిపనులపై సమానంగా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామంలో ఎంవీ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల మహిళల్లో అవగాహన పెరిగి ఈ రోజు మహిళా దినోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం ఇందుకు నిదర్శనమన్నారు. గ్రామంలో బాల్య వివాహాలు జరిగితే గ్రామపంచాయతీ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.డీఎల్ఎస్ఏ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ త వెంకటేష్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం వరకట్న నిషేధ చట్టం, గృహహింస నిరోధక చట్టం, బాల్య వివాహాల నిర్మూలన చట్టం, పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నిరోధక చట్టం, పోక్సో చట్టం వంటి అనేక చట్టాలు ఉన్నాయని తెలిపారు. మహిళలు ఈ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళలకు అవసరమైన న్యాయ సలహాలు అందించేందుకు లీగల్ ఎయిడ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అనంతరం గ్రామంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళలు, బాలికలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శిల్ప, ఉప సర్పంచ్ రాజు, ఏఎస్ఐ ప్రకాష్, తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య సభ్యులు ఆర్చిత, ఎంవీఎఫ్ ప్రతినిధులు శ్రీనివాస్, దేవకుమారి, గ్రామ పెద్దలు శివ్వయ్య, ఉపాధ్యాయులు, ఏడబ్ల్యుటీ కవిత, రేణుక, స్కూల్ చైర్మన్ లక్ష్మి, అడ్వకేట్ శ్రీనివాస్, వీఓఏలు సుజాత, మమత, అధ్యక్షులు లలిత, వార్డ్ సభ్యులు అనిత, శోభ, ఆశలత, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Share this article


