
అరెస్టు చేయడం ప్రజా పాలన కాదు : వడ్లనందు
Advertisement
వికారాబాద్, మార్చి 23: రాష్ట్రంలో బిజెపి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజా పాలన కాదని, ఇది రాక్షస పాలనకు నిదర్శనమని వికారాబాద్ బిజెపి అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపు మేరకు నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న నాయకులను పోలీసులు ముందస్తుగా ఇంటి వద్దే అరెస్టు చేయడం తీవ్రంగా ఖండించదగ్గ చర్య అని నందు తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాడేందుకు సిద్ధమైన నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన అన్నారు. ప్రశ్నించే వారిపై అరెస్టుల ద్వారా భయపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది పిరికిపంద చర్య అని మండిపడ్డారు. అరెస్టులు చేసి ప్రజల ఆగ్రహాన్ని అణచలేరని, జైలు గోడలు ప్రజా ఉద్యమాలను ఆపలేవని హెచ్చరించారు. ఈ అణచివేత ధోరణి ప్రభుత్వ పతనానికి నాంది అవుతుందని పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎన్. రామచందర్ రావుతో పాటు ఇతర బిజెపి నాయకులు, కార్యకర్తలను ఎటువంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని వడ్ల నందు డిమాండ్ చేశారు.
Share this article


