ఎంతో మంది త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం : శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

0
186 Views

వికారాబాద్:ఎంతో మంది త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి, జాతీయ జెండా ఆవిష్కరణ గావించారు. తెలంగాణ గీతాలాపన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ… స్వేచ్ఛ, స్వాతంత్రం మన సొంతం కావడానికి ఎంతోమంది ఈ గడ్డమీద అసమాన త్యాగాలు చేశారన్నారు. దేశమంతా 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటుంటే, హైదరాబాద్ ప్రజలు మాత్రం స్వేచ్ఛా స్వాతంత్రానికి పోరాడుతూనే ఉన్నారని ఆయన తెలిపారు. నిజాం నిర్బంధానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులై సాయుధ రైతాంగ పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ హామీల అమలుకు గ్రామాల్లో , వార్డుల్లో సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుండి 2 లక్షల 84 వేల లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి వివిధ పథకాలకు అర్హులైన వారిని గుర్తించడం జరుగుతుందని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే 1 కోటి 79 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందారని, దీని వల్ల మహిళలకు 65 కోట్ల రూపాయల ఆదా అయ్యారని తెలిపారు. అదే విధంగా 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ను అందించే దిశగా ఇప్పటికీ 1 లక్షా 20 లబ్ధిదారులను గుర్తించి 1 కోటి 73 లక్షల రూపాయల గ్యాస్ సబ్సిడీ అందించడం జరిగిందని ఆయన తెలిపారు. గృహ జ్యోతి పథకం ద్వారా సున్నా బిల్లు వచ్చిన లబ్ధిదారులకు ఆగస్టు వరకు 1 లక్షా 26 వేల వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం జరిగిందని, విద్యుత్తు అందించిన డిస్కంలకు 12 కోట్ల 53 లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లించిందని ఆయన తెలిపారు. ఇచ్చిన హామీల మేరకు 2 లక్షల రుణ మాఫీ మేరకు 1 లక్షా 9 వేల మంది రైతులకు 905 కోట్ల రూపాయల రుణ మాఫీ చేయడం జరిగిందని అన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా 3,200 మంది చికిత్సలు చేయడం జరిగిందని దీనికి ప్రభుత్వం 4 కోట్ల 60 లక్షల రూపాయలను చెల్లించడం జరిగిందని ఆయన తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో భాగంగా 1062 పాఠశాలలకుగాను 924 పాఠశాలల్లో పనులు ప్రారంభించి 792 పాఠశాలల్లో అన్ని రకాల పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. మిగతా పాఠశాల పనులు పురోగతిలో ఉన్నాయి. వీటికి 17 కోట్ల 23 లక్షల రూపాయలను చెల్లించడం జరిగిందని తెలిపారు.

భారీ వర్షాల కారణంగా జిల్లాలో 337 ఇళ్ళు దెబ్బతినగా ఒక్కో ఇంటికి 16,500 చొప్పున మొత్తం 55 లక్షల 60 వేల రూపాయలను తక్షణ సహాయం కింద అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుటకు అందరి సహకారం కావాలని ఆయన ఆకాంక్షించారు.

కలెక్టరేట్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా సంఘం లక్ష్మి భాయ్ , కొత్తగడి సాంఘిక సంక్షేమ, సంగం లక్ష్మీబాయి, మైనార్టీ గురుకుల పాఠశాల, బండి వెనుకచర్ల గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినిల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థినిలకు సభాపతి చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు. అదేవిధంగా జిల్లాలోని 278 మహిళా స్త్రీనిధి కింద సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 26 కోట్ల 76 లక్షల రూపాయలను, ప్రధానమంత్రి స్వానిధి కింద బ్యాంకు లింకేజీ కింద 15 కోట్ల రూపాయల చెక్కులను సభాపతి అందజేశారు.
తెలంగాణ ప్రజాపాల దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, పరిగి , తాండూర్, చేవెళ్ల శాసనసభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.