వర్షాల వల్ల దెబ్బతిన్న పంట, ఆస్తి, పశునష్టం ఇవ్వండి:సెర్ఫ్ సీఈఓ, జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్

0
130 Views

వికారాబాద్:వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, గృహాల, పశు సంపద వివరాల నివేదికలను సమర్పించాలని సెర్ఫ్ సీఈఓ, జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ అధికారులకు సూచించారు.ఆదివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వర్షాల వల్ల జరిగిన నష్టాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ … వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నష్టపోయిన రైతుల వివరాల నివేదికలను సమర్పించాలన్నారు. గ్రామాల్లో ప్రజలు ఏ ఒక్కరు కూడా నష్టాల వివరాలను నమోదు చేయలేదు అనే ఫిర్యాదులు రాకుండా అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. వర్షాల కారణంగా కూలిపోయిన ఇండ్లు , ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ భవనాలతో పాటు పశు సంపద నష్టాలను కూడా సమర్పించాలని ఆమె సూచించారు. దెబ్బతిన్న రహదారుల వివరాలను కూడా పంచాయతి రాజ్, ఆర్ అండ్ బి ఇంజనీర్లు నివేదికలు తయారు చేయాలని ఆమె తెలిపారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు పంట నష్టాల నివేదికలు సమర్పించాలని ఆమె తెలిపారు. జిల్లాలోని చెరువులు, కుంటల వివరాలను ఇరిగేషన్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణాలకు భూములను కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు సూచించారు.సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, వికారాబాద్ ఆర్డిఓ వాసు చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.ముందుగా సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ కు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ జిల్లా అధికారులు మొక్కల కుండీలతో సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని పంట నష్టాలను అధికారులతో కలిసి సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ పరిశీలించారు. పంట నష్టం పై తెలుసుకోవడానికి అధికారులు గ్రామాల్లోకి వస్తున్నారా అని ఆమె రైతులను అడిగి తెలుసుకోగా, అధికారులు పొలాల వద్దకు వచ్చి తెలుసుకుంటున్నారని ఆమెకు తెలిపారు.